Daggubati Rana: దగ్గుబాటి కుటుంబం నుండి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన వారిలో దగ్గుబాటి రానా కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడైన రానా “లీడర్” సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. బాహుబలి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రానా తన బాబాయ్ దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి ‘ రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇది మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ను రానా తెలుగుతో పాటు బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ నేషనల్ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో మన తెలుగు హీరోల గురించి రానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఈ సందర్భంగా రానా.. ఒకప్పుడు తెలుగు హీరోల గురించి బాలీవుడ్ జనాలకు ఎంత వరకు తెలుసు?
మన హీరోల గురించి చెబితే బాలీవుడ్ జనాలు ఎలా రియాక్ట్ అయ్యేవారు వంటి విషయాలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” గత 3,4 ఏళ్ళుగా తెలుగు సినిమాలు హిందీలో కూడా బాగా ఆడుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో రూపొందే చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇది అందరూ సంతోషించదగ్గ విషయం. కానీ గతంలో అలా ఉండేది కాదు. ఒకప్పుడు ప్రభాస్, మహేష్ అంటే బాలీవుడ్ జనాలకు కనీసం తెలీదు అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. ‘ఘాజీ’ సినిమా వల్ల హిందీలో నాకు ఒక గుర్తింపు ఉంది.
Daggubati Rana: మహేష్ అంటే నమ్రత భర్తగా మాత్రమే తెలుసు…
ఒకరోజు నేను ‘బాహుబలి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు ముంబైలో ఉన్న నా ఫ్రెండ్ ఒకరు.. ‘ఏ సినిమాలు చేస్తున్నావ్ అని అడిగారు . అప్పుడు నేను ‘బాహుబలి’ అన్నాను. ‘హీరో నువ్వేనా?’ అని అతను అడిగితే.. ‘కాదు ప్రభాస్ అని చెప్పాను’. అప్పుడు అతను..’ప్రభాస్ ఎవరు’ అని అడిగాడు. ప్రభాస్ నటించిన సూపర్ హిట్ సినిమాల గురించి చెప్పిన ఆ వ్యక్తి తనని గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత మహేష్ గురించి చెప్తే.. ‘చిన్ను భర్త కథా.. తెలుసు’ అన్నాడు. నమ్రత గారిని చిన్ను అని అంటారు. ఆమె భర్తగా మాత్రమే మహేష్ అక్కడి జనాలకు తెలుసు. కానీ అతని సినిమాలు మాత్రం అక్కడి జనాలకు తెలీదు. అప్పుడు నేను అతనితో ఒక 4,5 ఏళ్ళు ఆగు మా హీరోలంతా ఇక్కడ ల్యాండ్ అవుతారు అని చెప్పాను. ఇప్పుడు అది నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లో మన టాలీవుడ్ హీరోల హవా నడుస్తోంది.” అంటూ రానా చెప్పుకొచ్చాడు.