Actor Sachin Joshi నటుడు, నిర్మాత సచిన్ జోషి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతో పాటు హిందీలోనూ పలు సినిమాలు చేశాడు ఈ యంగ్ హీరో. మౌనమేలనోయి సినిమాతో తెలుగులోనే హీరోగా తన కెరీర్ను స్టార్ట్ చేశారు సచిన్. తర్వాత నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, నీ జతగా నేనుండాలి, వీడెవడు వంటి చిత్రాల్లో నటించారు. హీరోగానే కాకుండా నిర్మాత గానూ పలు సినిమాలను రూపొందించారు. అలాగే సెలబ్రిటీ క్రికెట్ లీగ్లోనూ టాలీవుడ్ తరపున ఓపెనర్ ప్లేయర్గా సచిన్ జోషి ఆకట్టుకుంటూ తెలుగు ప్రేక్షకులను మరింత చేరువయ్యారు.
అయితే తాజాగా సచిన్ జోషికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన ఆస్తులను జప్తు చేసింది. సచిన్ జోషికి సంబంధించిన రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసినట్లు సమాచారం అందుతుంది. ఇందులో రూ.330 కోట్ల వరకు ఓంకార్ గ్రూప్కు చెందిన ఆస్తులు కాగా, మిగిలిన రూ.80 కోట్లు వైకింగ్ గ్రూప్ కంపెనీకి చెందినవని ఈడీ వెల్లడించింది. ఎస్ఆర్ఏ అనే ప్రాజెక్టులో భాగంగా సచిన్ జోషికి చెందిన ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా సచిన్ జోషి ఆస్తులని జప్తు చేసింది.
ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. లోన్ ఫ్రాడ్ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది. ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈమేరకు ఔరంగాబాద్ సిటీ చౌక్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయ్యింది. కిందటి ఏడాది సచిన్ జోషి అరెస్ట్ అయ్యాడు కూడా. అలానే నిర్మాత బండ్ల గణేష్తో సచిన్ జోషికి ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలున్నాయి. ఒకానొక దశలో తనను బండ్ల గణేష్ మోసం చేశాడని సచిన్ ఆరోపణలు చేశారు. బండ్ల గణేష్ తోడేలు లాంటి వ్యక్తి అని, తనపై 14 కేసులు పెడితే బండ్ల గణేష్ తండ్రి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే వదిలేశానని, బండ్ల గణేష్ నుంచి తనకు రూ.27 కోట్లు రావాల్సి ఉందని వీడెవడు సినిమా ప్రమోషన్స్ సమయంలో సచిన్ జోషి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.